Friday, February 26, 2021

మాఘ మాసం అమోఘం - మాఘ పౌర్ణమి ప్రాశస్త్య౦

 ప్రియమైన శివ పరివారం కు మహా మాఘి  శుభాకాంక్షలు 

‘మఘము’ అంటే యజ్ఞం. యజ్ఞ, యాగాలూ, పవిత్రమైన దైవ కార్యాలూ చేయడానికి అత్యున్నతమైనదిగా మాఘ మాసాన్ని పెద్దలు ప్రస్తుతించారు. "మా - అఘం'' అంటే పాపం యివ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు.

అలాంటి మాఘ మాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే ‘మహా మాఘి’ అని కూడా అంటారు. లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత. లలితా దేవి ఆవిర్భావ గాథ దేవీ పురాణంలో ప్రస్తావితమై ఉంది.కావున  లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత. 

మాఘస్నానం వల్ల అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్షుతోపాటు మంచితనం, ఉత్తమశీలం లభిస్తాయని పద్మ పురాణంలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రభావాలకు ముఖ్య కారణం సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడమే. ఈ సమయంలో శివకేశవులు ఇరువురినీ పూజించాలనీ, దాన ధర్మాలు చేయాలనీ సాధ్యమైనంత వరకు దైవచింతనతో గడపాలని పండితులు చెబుతారు. ఈ మాసమంతా నదీ స్నానం సాధ్యం కాకపోయినా కనీసం మాఘశుద్ధ సప్తమి, ఏకాదశి, పౌర్ణమి, కృష్ణపక్ష చతుర్దశి రోజులలో అయినా చేయాలి. ఎందుకంటే అన్ని జలాల్లోనూ గంగ ప్రవేశించి ఉంటుందన్న నమ్ముతారు.

మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. "మా'' అంటే మహాలక్షీ. "ధనుడు'' అంటే భర్త. మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందుకే శ్రీమహాలక్ష్మీ కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది. విద్యాధిదేవత, వాగ్దేవి, జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచిమినాడు జన్మించింది. అందుకే మాఘశుద్ధ పంచమిని "శ్రీపంచమి'' అని అంటారు. "శ్రీ'' అంటే లక్ష్మీదేవి అనే కదా మనందరి అభిప్రాయం.

    "శుద్ధలక్ష్మీ: మోక్షలక్షీ: జయలక్ష్మీహ సరస్వతే

     శ్రీర్లక్ష్మీ: వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమసర్వదా''


కనుకనే శ్రీమహాలక్ష్మీ "శ్రీపంచమి''నాడు సరర్వతీదేవి రూపంలో భాసిస్తుంది. ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు "అక్షరభ్యాసం'' జరిపిస్తారు. ఈ నాఘమాసంలోనే ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడు సప్తమి తిథినాడు జన్మించాడు. అందుకే మాఘశుద్ధసప్తమి "రథసప్తమి'' పర్వదినం అయింది. లయకారుడైన పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి మాఘ బహుళ చరుర్ధషిని "శివరాత్రి'' పర్వదినం చేశాడు. విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని సర్వమానవాళికి అందించిన భీష్మ పితామహుడు ఈ మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదం చేరి, మాఘశుద్ధ ఏకాదశి "భీష్మ ఏకాదశి'' పర్వదినం చేశాడు.

జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని "కేతువు'' పరిపాలిస్తూంటాడు. కేతువు జ్ఞానప్రదాత, మోక్షకారకుడు. కనుక ఈ మాసంలో కేతువి విశేష పూజలు అందుకుంటాడు. చాంద్రమానం ప్రకారం చంద్రుడు "మఖ'' నక్షత్ర మండలంతో కూడి వుండే మాసం కనుక ఈ మాసానికి "మాఘమాసం అనే పేరు వచ్చింది. అందుకే  ఈ మాఘం - అమోఖం.

పితృయజ్ఞానికి ప్రాధాన్యత :

మాఘ అమావాస్య పితృకార్యాచరణకు ఎంతో ప్రధానమైన రోజు. ఆ రోజున పైతృకం చేస్తే పితృదేవతలు పదివేల సంవత్సరాల పాటు స్వర్గసుఖాలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రహణకాలాలు, సంక్రమణాలు "పైతృకాలకు'' ఎంతో అనువైన కాలాలుగా భావిస్తారు. అయితే, ఆదివారం, అమావాస్య, శ్రవణనక్షత్రం, వ్యతీపాత యోగం అన్నీ ఒకేరోజున కలిసివస్తే దాన్ని "అర్ధోదయ పుణ్యకాలం'' అంటారు. అది గ్రహణకాలం కన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. పైగా మాఘ అమావాస్య, శతభిష నక్షత్రంలో కూడి వుంటే మరింత విశేషమని ధర్మసింధువు చెబుతుంది. కనుక, ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే, పుత్రధర్మాన్ని నిర్వర్తించిన వారిమౌతాం.

మాఘపూర్ణిమ - మహామాఘి :

మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా! నిజానికి మకర సంక్రమణం జరిగినది మొదలు కుంభసంక్రమణం జరిగేవరకు మధ్య ఉండే మధ్యకాలమే "మాఘమాసం''. పవిత్రస్నానాలు పౌష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘశుక్ల పూర్ణిమటో ముగుస్తాయి. చాంద్రమానం అనుసరించేవారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడం విశేష పూర్వప్రదం. కానీ, ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కానీ పని తెలిసే ... కనీసం "మాఘపూర్ణిమ'' నాడైనా నదీస్నానం గానీ, సముద్రస్నానం గానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలంటారు. ఎందుకంటే మాఘపూర్ణిమను "మహామాఘి'' అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ "మాఘ పూర్ణిమ'' అత్యంత విశేషమైనది. ఈ "మహామాఘి'' శివ, కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్రస్నానం చేసితీరాలి. శివ, కేశవులిద్దరినీ ఆరాధించి తరించాలి.

ఆ సమయం లో  దేవతలు తమ సర్వ శక్తులు, తేజస్సులను జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘ స్నానం చాలా గొప్పది. నది దగ్గరలో లేని వారు కనీసం చెరువులో గానీ, కొలనులోగానీ, లేక బావి దగ్గర గానీ స్నానం ఆచరించాలి. మాఘ స్నానం ప్రవాహ జలంలో చేస్తే అధిక ఫలితం.

"స్నానం'' అంటే "షవర్ బాత్'' చేయడమో, "స్విమ్మింగ్ పూల్''లో చేయడమో కాదు. నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిలబడి, కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి. ఏమిటీ ఛాదస్తం అని విసుక్కోవద్దు. ఛాదస్తం కాదు, సైన్స్. నీటిలో విద్యుచ్చక్తి ఉందని సైన్సు చెబుతుంది. కానీ ఈ సైన్సు పుట్టుక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీస్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు.

మాఘస్నాన మహాత్మ్యం గురించి బ్రహ్మాండ పురాణం తెలిపింది. మృకండు మహర్షి- మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలం వల్లే వారి కుమారుడైన మార్కండేయుడు మృత్యువును జయించాడని ని పురాణ కథనం.

సూర్యోదయకాలం నుంచి, సూర్యాస్తమయం వరకూ ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్చక్తిని నదీజలాలు, సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. నీటిలో వుండే ఈ అద్భుతశక్తులు ... తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు. సముద్రం, నదులు అందుబాటులో లేనివారి పరిస్థితి ఏమిటి? అనే సందేహం కలుగుతుంది. అలాంటి పరిస్థితిలో బావుల దగ్గరగానీ, చెరువుల వద్దగానీ "గంగ, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి'' నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి, కర్రలా తేలినా ఫలితం శూన్యం

మనకి అలంటి అవకాశం లేదు కాబట్టి మనం స్నానం చేసే సమయం లో ఆ నీటిలో గంగ మాత 12 నామాలు చెప్పుకుని నీటిలో గంగ ప్రవేశం చేసే స్నానం చేస్తే మంచిది.అవన్నీ మాకు తెలియదు అనుకుంటే ‘గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అనే శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి.

"దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ

ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం

మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ

స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ''

అని పఠించి, మౌనంగా స్నానం చేయాలి, అంటే "దుఃఖములు, దారిద్ర్యము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను. కనుక ఓ గోవిందా! అచ్యుతా! మాధవా! ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు'' అని అర్థం.

ఇదండీ మాఘ మాసం అమోఘం అయినది , ఇంకా బోలెడు విశేషాలు ఉన్నాయి.. 

మరొక విశేషం లో తెలుసుకుందాం

ఇట్లు 

శివ పరివారం 

Wednesday, February 24, 2021

శ్రీ కృష్ణుడు లీలలు - ఓ యమ్మ ! నీ కుమారుడు

 ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ


ప్రతి రోజు గంగ ప్రవాహం లా జరిగే మన భాగవత ఘట్టం లో దశమ స్కంధం లో శ్రీ కృష్ణుడు లీలలు గురించి చెబుతుంటే భలే ఆనందం గా ఉంది. ఈ పద్యం ఎప్పుడు వస్తుందా అని నేను రెండు మూడు రోజులు నుంచి చూస్తున్నాను.


ఓ యమ్మ ! నీ కుమారుడు మాయిండ్లలొ పాలు పెరుగు మననీడమ్మా !

పోయెద మెక్కడికైనను మా యన్నల సురభులాన మంజుల వాణీ !


గోపకాంతలు యశోదమ్మతో తమ కష్టాలు చెప్పుకున్నారు .కానీ యే తల్లైనా తన కొడుకు తప్పు చేసాడంటే ఒప్పుకుంటుందా ?


అన్యమెఱుగడు తనయంత నాడుచుండు , మంచివాడీతడెగ్గులు మానరమ్మ

రామలార ! త్రిలోకాభిరామలార ! తల్లులార ! గుణవతీమ తల్లులార !


తెలుగులో ఇంతకంటే సరళమైన పద్యం ఉండదు . ఒక్క సురభులాన అన్న పదం తప్పితే

మిగిలీన పదాలన్నీ మనం ప్రతిదినం వాడేవే . శ్రీకృష్ణుడు చిలిపి పనులు చేస్తున్నాడు . వెన్న కనిపిస్తే వదలడు . పాలు పెరుగు మాట వేరే చెప్పవలసిన పని లేదు .గొల్లభామలకు ఏం చేయాలో తోచలేదు . యశోదమ్మ దగ్గరకు వెళ్ళి ” అమ్మా ! నీ కొడుకు మా ఇళ్ళలో పాలూ , పెరుగూ దక్కనీయడం లేదు . ఈ బాధలు భరించలేము . . ఇక పిల్లాపాపలతో ఎక్కడికైనా వెళ్ళిపోతాం . మా ఆవులమీద ఒట్టు ” అని మొరపెట్టుకున్నారు .ఇవేవో మన ఇళ్ళల్లో మాట్లాడుకున్నట్టుగా లేవూ ?

.

నా కన్నయ్యకు నా పాలు తాగడం తప్ప వేరే పని లేదు . అటు ఇటు వెళ్ళగా నేను చూడలేదు . కళ్ళు తెరవని పసి గుడ్డు . తనంతట తాను ఆడుకుంటూ ఆనందిస్తాడు . మంచివాడు మా చిన్ని కృష్ణుడు . మీరందరూ  సద్గుణవతులు, అందమైన వారు , చాడీలు చెప్పడం మానుకొండి అని వారిని వేడుకునే సందర్భం .


ఈ పద్యాలు .నానన్నమ్మ / అమ్మమ్మలు  లు ఒకప్పుడు పిల్లకు నేర్పిచి పెంచే వారు.. ఓయమ్మ నీ కుమారుడనే పద్యం నేర్చుకోవడం ఎంత సులభమో ఒక సారి గమనించండి . ఒక్క పదం కూడా పలకడానికి కష్టంగా ఉండదు . అర్థం చేసుకోవడం అతి సులభం . పద్యం నేర్చుకున్న పిల్లలకు తల్లి ప్రేమ తెలుస్తుంది . ఏ తల్లీ తన తనయుణ్ణి తప్పుబట్టదు కదా ! మన సంస్కృతి తెలియాలంటే ఇటువంటి పద్యాలు పిల్లలకు నేర్పించడం తప్పనిసరి.


పల్లెటూళ్ళలో బ్రతకడానికి కావలసిన వస్తువులు బహుకొద్ది . మితమైన ఆహారం అందులో ముఖ్యమైనది . అందులో పాలూ , పెరుగూ పిల్లలకు తప్పనిసరిగా కావాలి . కృష్ణ స్వామి వాటినే దొంగిలిస్తున్నాడు . ఇది చాలదన్నట్లు అతివలను ఇబ్బంది పాలు చేస్తున్నాడు . ఇక ఆ పల్లెలో ఉండడమెలా? వెళ్ళిపోతామని మొర పెట్టుకుంటున్నారు యశోదమ్మతో .

అసలు ఈ పద్యం లో ఉండే రహస్యం వేరేగా ప్రయత్నించారు..ఈ కృష్ణ స్వామి కోసమే మేము ఉన్నాము.. కృష్ణుడు లేని ప్రదేశం మేము ఊహిచుకోలేము అని అంతరార్ధం ఈ పద్యం లో అట్టేపెట్టారు. ...

పెద్దగా చదువుకోని పల్లె వాసులు ఉపయోగించే పదాలనే ఉపయోగించి తమ కష్టాలను వివరించడం ఈ పద్యంలో విశేషం . మరి చిన్న పదాలుపయోగించడం వలన భాషలో సౌందర్యం ఏమైనా తగ్గిందా ? నిజం చెప్పాలంటే భాషా సౌందర్యం పెరిగింది . చెప్పవలసిన భావం మన మనస్సుకు హత్తుకునేలా  ఎన్నో సద్గుణాలున్న పోతన  గారు కవిత్వంలో ఇదీ ఒకటి .


ఇట్లు 

శివ పరివారం 

Thursday, February 18, 2021

భీష్మాష్టమి

 ప్రియమైన శివ పరివారం కు శుభాకాంక్షలు 

మనం ప్రతి సం భీష్మ తర్పణం ఎలా చేసుకుంటున్నామో క్రమం తప్పకుండ ఈ సం కూడా చేసుకోవాలని పరమేశ్వర సంకల్పం  

ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం భీష్మ అష్టమి అనుసరించవలసి ఉంటుంది. 

మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమి అంటారు. ఈ రోజునే భీష్మ పితామహుడు మోక్షప్రాప్తిని పొందిన పర్వదినమని వేదం lo  చెబుతారు. భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అలాంటి భీష్మాష్టమి రోజున ఏంచేయాలి? ఏం చేస్తే... మోక్షం కలుగుతుందో తెలుసుకుందాం...

భీష్ముడే లేకపోతే భారతమే లేదు! అని నా అభిప్రాయం 

నలభై ఆరు రోజుల పాటు అంపశయ్య మీద ఉన్న కురువృద్ధుడు ఈ రోజున (భీష్మాష్టమి) తన ఇష్టం ప్రకారం ప్రాణాలను వదిలాడు. సాధారణంగా తండ్రి బతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కారు. కానీ భీష్మ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించరు. అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడికి ఉంది. అలాంటి మహిమాన్వితమైన రోజున సూర్యోదయమునకు ముందే (ఐదు గంటలకు) లేచి పూజామందిరం, ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. తలంటు స్నానం చేసి, తెలుపు రంగు దుస్తులను ధరించాలి. .

ఈ మాఘమాసం లో ఈ 5 రోజులు చాల ముఖ్యమైనవి..  మనం అందరం భీష్ముడు కి తర్పణం ఇవ్వాలి . ఇక్కడ అందరికి ఒక సంశయం వచ్చును. తర్పణాదులు తండ్రి లేని వారికి మనకు ఎందుకు? అని. కానీ ధర్మ శాస్త్రం చెప్పింది భీష్మ తర్పణం, యమ తర్పణం తండ్రి బతికి వున్నవాళ్ళు కూడా చేయవలసిందే. అది ప్రతి ఒక్కరి కర్తవ్యం. రథ సప్తమి నాడు స్నానం ఆచరించడం వల్ల మనకు ఏడేడు జన్మలలో చేసిన పాపములు త్యజింపబడుతుంది. ఆ శుద్ధమైన ఆత్మతో మనము భీష్మ పితామహునికి అర్ఘ్యం ఇవ్వవలసి వుంటుంది.

భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా సత్యధర్మములకు కట్టుబడి జీవించి చివర శ్రీకృష్ణుని సన్నిధిలో ముక్తినిబడసినవాడు, మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి కింద ఇచ్చిన శ్లోకములను చెప్పి ఇవ్వవలసి వుంటుంది. అలాగే తర్పయామి అని చెప్పినచోట్ల నీటితో భీష్మునికి తర్పణలు కూడా వదలవలసి ఉంటుంది. ఒక్క భీష్ముని విషయంలో మాత్రం తర్పణ తండ్రి జీవించి ఉన్నవారుకూడా తర్పణలు చేయవలెనని నిర్దేశించారు. నరకచతుర్దశి, దీపావళి సమయంలో యమ తర్పణం ఎలాఐగే తండ్రి జీవించి వున్నవాళ్ళు కూడా చేస్తారో. అదే విధిన భీష్మ తర్పణం కూడా నిర్వహించాలి. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం.

భీష్మతర్పణ విధి

శుక్లాష్టమ్యాం తు మాఘస్య దద్యాత్ భీష్మాయ యో జలమ్ !

సంవత్సరకృతం పాపం తత్‌క్షణా దేవనశ్యతి !! అని వ్యాసోక్తి

నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!"

తర్పణము

1. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! గంగాపుత్రవర్మాణం తర్పయామి !! (3 సార్లు)

2. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! భీష్మవర్మాణం తర్పయామి !! (3 సార్లు)

3. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! అపుత్రపుత్రవర్మాణం తర్పయామి !! (3 సార్లు)

1. భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః!

ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!! (దోసిలితో నీరు విడువవలెను)

2. వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ!

అపుత్రాయ దదామ్యేతత్ ఉదక భీష్మ వర్మణే!! (దోసిలితో నీరు విడువవలెను)

3. వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ!

అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!! (దోసిలితో నీరు విడువవలెను)

పునరాచమ్య ! సవ్యేన అర్ఘ్యం దద్యాత్ !!

(తిరిగి ఆచమించి తూర్పుముఖంగా సవ్యముతో దేవతీర్థంగా అర్ఘ్యమీయాలి)

1. వసూనామవతారాయ అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)

2. శంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)

3. భీష్మాయ అర్ఘ్యం దదామి !!(దోసిలితో నీరు విడువవలెను)

4. ఆబాల్య బ్రహ్మచారిణే అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)

అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!!


ఏకారణంచేతనైనా పై విధానంలో తర్పణలీయడం కుదరకపోతే, కనీసం ఈ క్రింది శ్లోకమ్ చెప్పి మూడు సార్లు దోసిలితో నీటిని వదలవలెను


నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!"

వైయాఘ్ర పద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ !

గంగా పుత్రాయ భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణే!

అపుత్రాయ దదామ్యేతత్ ఉదకం భీష్మ వర్మణే!

అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!!

భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది 

భీష్మ తత్వం..గురించి తెలుసుకుందాం 

తండ్రికిచ్చిన మాటకోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగా గడిపిన భీష్ముడు, పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని మాత్రం త్వజించాడు.

పంచమవేదమైన మహాభారతాన్ని వేదవ్యాసుడు రాసినా, భీష్ముడే లేకపోతే భారతమే లేదు! తండ్రి సౌఖ్యం కోసం సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తాను వివాహం చేసుకోవడం ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లు పోతుందో అన్న సంశయంతో ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని ‘భీషణ’ ప్రతిజ్ఞ చేసిన గొప్పవాడు. తాను కోరుకునే సమయంలోనే మరణించగలిగే వరం ఆయన సొంతం. అందుకే మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్నా... ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ వేచి చూశాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత తనకు మోక్షం కలిగించమని ఆ శ్రీకృష్ణ పరమాత్ముని అష్టమి రోజున వేడుకున్నాడు.

భీష్ముడి జీవితమంతా పరిపక్వంగానే గడిచింది. ఇక మరణసమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురుకుల వృద్ధుడు. అంపశయ్యపై ఉన్న తనను చూడటానికి వచ్చిన ధర్మరాజుకు, రాజనీతి గురించి బోధించాడు. పాండవులతో అక్కడకు వచ్చిన కృష్ణపరమాత్ముడుని స్తుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికాడు. భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే, పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ 'తాతా! నాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని ప్రశ్నించిది.

అందుకు భీష్ముడు 'అవును తల్లీ! ఈ దేహం నా అధీనంలో లేదు, అది ధుర్యోదనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా, నా దేహం నా మాట వినలేదు... అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నాన’ని చెప్పాడు. ​ కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు, పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్వజించాడు.

భీష్మ పితామహుడికి సంతానం లేకపొయినా మరణించాక ఈనాటికి పితృతర్పణాలు అందుతూ ఉన్నాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భారతకథలో నిలిచిపోయిన మహొన్నతుడు భీష్మపితా మహుడు. ఈయనకు ఇంతమహత్యం సిద్ధించడానికి ఆయన గుణశీలాలే ప్రధానకారణం. మహాతపస్వి అయిన భీష్ముడు పితృభక్తికి, ఇచ్చినమాట నిలబెట్టుకోవడానికి, శౌర్యసంపదకు ఓ గొప్ప ఉదాహరణ. అంతేకాదు ఈయన అపారమైన శాస్తవ్రిజ్ఞానాన్ని, ధర్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని కూడా చక్కగా అవగతం చేసుకున్నాడు. భీష్మునిలోని భగవతత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఈయననెంతగానో ప్రశంసించాడు. అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహంతోనే సాక్షాత్తూ ధర్మదేవత తనయుడే అయిన ధర్మరాజుకు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు. వర్ణాశ్రమ ధర్మాలు, రాజ ధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్ష ధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, స్ర్తీ ధర్మాలు, దాన ధర్మాలు, ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మసందేహాలన్నింటినీ తీర్చి చక్కటి సమాధానాలిచ్చాడు భీష్ముడు. చక్కటి కథల రూపం లో... వినగానే ఎవరైనా అర్ధం చేసుకోగల తీరులో అవన్నీ మహా భారతం శాంతి, అనుశాసనిక పర్వాలలో నిక్షిప్తమై ఉన్నాయి.

ఆ కథలను ధర్మరాజుకు చెబుతున్న సమయంలో వ్యాసుడులాం టి గొప్ప గొప్ప ఋషులు కూడా మంత్రముగ్ధులైనట్లు వింటూ ఉండేవారు. కృష్ణతత్వాన్నీ బాగా అవగతం చేసుకున్నవాడు కనుకనే కృష్ణుని గొప్పతనాన్ని గురించి దుర్యోధనుడికి సైతం చెప్పగలిగాడు. రాజసూయయాగ సమయంలో అగ్రతాంబూ లం ఎవరికివ్వాలా అని సందేహం కలిగినప్పుడు అక్కడున్నవారిలో దీనికి అర్హుడు ఒక్క కృష్ణుడే అని నిర్ద్వంద్వంగా అందరికీ తెలియజేశాడు భీష్ముడు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని రక్షించేందు కు చక్రాయుధంతో తన మీదకు కృష్ణుడు పరిగె త్తుకొస్తున్నా ఆయనను ఎదిరిం చక ఆయన చెతిలో మరణించే భాగ్యం కోసం ఎదురుచూశాడు భీష్ముడు. అన్నిటినీ మించి భీష్మాచార్యు డు ఆనాడు ధర్మరాజుకు ఉపదే శించిన విష్ణు సహస్రనామాలు ఈనాటికీ ప్రజల నాలుకల మీద నానుతూనే ఉన్నయి.

భీష్ముడు అందించిన విష్ణుసహస్రనామాలను ఈరోజున పటిస్తే, విశేష ఫలితం దక్కుతుంది. కాబట్టే దీనిని శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తారు. భగవద్గీతను పఠించడానికి ఇది అనువైన రోజు.

భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని నమ్మకం. ఇక భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే! ఆచార్యునిగా, భరతవంశానికి ఆదిపురుషుడిగా మనకు చిరస్మరణీయుడు. అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని సూచిస్తారు. భీష్ముని తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయట. ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రం, చెప్పులు, జలపాత్ర, వస్త్రాలు దానం చేస్తే శుభం కలుగుతుంది. రథసప్తమి నుంచి సూర్యుని తీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి, బహుశా ఈ సూచని చేసి ఉంటారు.

మాఘశుద్ద అష్టమి నుంచి ద్వాదశి వరకూ ఉన్న ఐదు రోజులనూ భీష్మ పంచకం అని పిలుస్తారు. ఈ అయిదు రోజులూ భీష్ముడి వ్యక్తిత్వాన్ని తలచుకుంటారు. ఆ మహనీయుడి జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ ఐదు రోజులనూ కేటాయిస్తారు. తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారం ఇది.

ఆది శంకరా చార్యులు భగవద్గీత, ఉపనిష త్తులు, బ్రహ్మ సూత్రాలకు భాష్యాన్ని రాసినట్టుగానే ఈ విష్ణు సహస్రనామాలకు కూడా విశేష భాష్యం చెప్పారు. అంతటి మహత్తరమైన భగవత్శక్తి దాగి ఉన్న విష్ణు సహస్రనామా లను చెప్పడం ఒక్కటి చాలు భీష్ముడిమహ త్యాన్ని గురించి తెలుసుకోవటానికి భీష్మ పితామహుడు ఇలా భక్తి, జ్ఞాన తదితరాలలో గొప్ప కృషి చేసినందువల్లనే ఈనాటికీ అందరికీ ఆయన మార్గ దర్సకుడుగా నిలిస్తున్నాడు


ఇట్లు 

శివపరివారం 

Friday, February 12, 2021

“పుట్టం బుట్ట” పద్యార్థము.

.ఆంధ్ర భాగవతమున స్తుత్యాదికములందు పోతన మహాకవి తన నమ్రతను స్పష్టీకరించుచు-


పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభో యానపాత్రంబునన్

నెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింపన్ దొరం కొంటి మీఁ

దెట్టేవెంట రచింతుఁ దత్సరణి నీ వీవమ్మ; యో యమ్మ; మేల్

పట్టున్ మానకువమ్మ; నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ; దయాంభోనిధీ!


అని సరస్వతిని ప్రార్థించినాడు. ఈ పద్యమునకు సాధారణముగా మనలో నించుమించందరు జెప్పుకొనెడి యర్థము: పుట్టంబుట్ట = వాల్మీకిని గాను, శరంబునన్ మొలవ = శరవణభవుడు గాను, అంభోయాన పాత్రంబునన్ నెట్టన్ గల్గను = వ్యాసుడను గాను, కాళిగొల్వను = కాళదాసుడనుగాను, పురాణింపన్, దొరంకొంటి= పురాణింప బూనుకొంటిని.

ఈ పద్యమును చదివినప్పుడెల్ల రెండవవ్యక్తియగు శరంబునన్ మొలచిన శరవణభవుడు కవియనిగాని, పురాణకర్తయనిగాని ప్రసిద్ధి యెచ్చటను గనపడక పెద్దల ననేకులను ప్రశ్నించితిని. అందరు “అచ్చటనే మాకును సందేహ” మనెడువారును, “చూడవలెను” అనువారును దప్ప ఒక్కరైన సుబ్రహ్మణ్యదేవుడు కవియనిగాని, గ్రంథకర్తయనిగాని నిరూపింపరైరి. సందేహనివారణార్థము చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమున నున్న వ్రాతప్రతు లన్నిటిని శోధించి చూచితిని. అన్నిటను “బ్రౌను దొరవారు శుభ్రం చేయించిన గ్రంథము” లో గూడ “శరంబునన్“ అనియే యున్నది.

వాల్మీకి, వ్యాసుల నడుమ జిక్కిన “శరంబునన్ మొలవ” శబ్దములను మరల మరల మననము చేయుచుండగా నొక్కపాఠము స్ఫురించినది. అందలి సామంజస్యమును పెద్దలకు వదలి నాకు దోచినది పాఠకలోకమునకు సమర్పించుకొనుచున్నాడను.

పద్యమును ప్రతి పదార్థమునకు విరుచునప్పుడు “ పుట్టం బుట్ట శంబునన్ మొలవ” అను రెండు భాగములుగా విరువక ఒక్కటిగా “ పుట్టన్ పుట్టశిరంబునన్ మొలవ” అని శరమును శిరముగా చదివినచో “పుట్ట= వల్మీకము, శిరంబునన్ మొలవ= తలపై పుట్టునట్లుగా, పుట్టన్= పుట్టలేదు. అంభోయాస-. = పడవయందు పుట్టలేదు.

అనగా “వ్యాసుడనుగాను” అనుకున్నచో అన్వయార్థాదులు చక్కగా లభించుచున్నవి. ఏనాడో ఎవ్వరో తాటాకు వ్రాతప్రతులనుండి యుద్ధరించిన తొల్తటివారు “శిరంబునన్” అనుదానిని “శరంబునన్” అని చదువుకొని దానికి ఏదో అర్థమును సమన్వయించుకొని యుండవచ్చును. జిలుగక్షరములలో “శి” “ శ” గా మారుటయందు వింతలేదు. ఉన్నదానికేదో యొక అర్థము కుదిరిన వెనుక దానిని గురించి యాలోచన కూడ తప్పి యుండవచ్చును. కావున నీ పద్యమున పై పాఠాంతరమును పాటించినచో విద్యార్థు లనేకుల కిట్టి సంశయములు మానగలవు.