Thursday, March 18, 2021

షష్ఠ్యంతములు





హారికి, నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్య సం

హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో

హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా

హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్.

భావము:

మనోహర హారాలు ధరించువాడికిం; నంద వంశం వారి గోకులంలో విహరించినవాడికి; తృణావర్తు డనే దానవుణ్ణి సంహరించిన వాడికి; భక్తుల పరితాపాలను పరిహరించువాడికి; గోపాంగనల మనస్సులను అపహరించినవాడికి; దుష్టుల సంపదలను హరించిన వాడికి; వ్రేపల్లెలో గోపికల యిండ్లలో పాలు, నెయ్యి, అపహరించినవాడికి; పిల్లల పాలిటి పెనుభూతమైన పూతన అనే మహారాక్షసిని మట్టు పెట్టినవాడికి.


శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణ హస్త ని

ర్మూలికి, ఘోర నీరదవిముక్త శిలాహతగోపగోపికా

పాలికి, వర్ణధర్మపరిపాలికి, నర్జునభూజయుగ్మ సం

చాలికి, మాలికిన్, విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్.

భావము:

శీలవంతుడికి; నీతిమంతుడికి; త్రిశూలధారియైన శివుణ్ణి వశం చేసుకున్నవాడికి; బాణాసురుని బాహువులు ఖండించిన వాడికి; ఇంద్రుని పంపున మేఘాల నుండి కురిసిన రాళ్ల జల్లుకు చెల్లా చెదరైన గోపాలురను, గోపికలను కాపాడినవాడికి; వర్ణాశ్రమ ధర్మాలను ఉద్ధరించిన వాడికి; జంట మద్ది చెట్లు పెల్లగించినవాడికి; వనమాల ధరించు వాడికి; సైంధవ సంహార సమయాన తన చేతి చక్రంతో సూర్యమండలాన్ని కప్పివేసినవాడికి.


క్షంతకుఁ, గాళియోరగవిశాలఫణావళినర్తనక్రియా

రంతకు, నుల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ

హంతకు, నింద్ర నందన నియంతకు, సర్వచరాచరావళీ

మంతకు, నిర్జితేంద్రియసమంచితభక్తజనానుగంతకున్.


భావము:

క్షమాగుణశీలికి; కాళీయుని విశాలమైన పడగలపై నాట్యమాడటం నేర్చినవాడికి; పొంగి దాడిచేసిన భయంకరమైన జరాసంధుని చతురంగ సైన్యాలను హతమార్చినవాడికి; పార్థుని రథాన్ని పార్థుని నడిపించినవాడికి; సమస్త చరాచర ప్రపంచం స్మరిస్తుండే వాడికి; జితేంద్రియులైన భక్తుల వెంటనుండువాడకి.

న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన

స్థ్సాయికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం

ధాయికిఁ, బీతవస్త్రపరిధాయికిఁ, బద్మభవాండభాండ ని

ర్మాయికి, గోపికానివహ మందిరయాయికి, శేషశాయికిన్.


భావము:

న్యాయాన్ని మెచ్చువాడికి, చచ్చిపోయిన బ్రాహ్మణ బాలుణ్ణి తెచ్చి యిచ్చినవాడికి, రుక్మిణీదేవి మనస్సుకు బాగా నచ్చినవాడికి, సకల జగత్తుకీ సంతోషాన్ని సమకూర్చేవాడికి, సజ్జనుల ఆదరాభిమానాలను తీర్చిదిద్దేవాడికి, పట్టు పీతాంబరాన్ని కట్టుకునేవాడికి, బ్రహ్మాండ భాండాలను సృజించేవాడికి, గోపికల గృహాలన్నింటికి వెళ్ళువాడికి, ఆదిశేషునిపై శయనించేవాడికి.



Tuesday, March 16, 2021

గోపికా వస్త్రాపహరణ - శ్రీ కృష్ణ లీలామృతం

 ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ లీలామృతం 

మనకి నిత్యం గంగా ప్రవాహం లా జరిగే శ్రీ మద్ భాగవతం లో ఇప్పుడు గోపికా వస్త్రాపహరణ ఘట్టం లో ఉన్నాము . అసలు శ్రీమద్భాగవతం లో  శ్రీకృష్ణలీలా రసామృతం. లీలలన్నీ అభౌతికాలు, అధ్యాత్మ రహస్యగర్భితాలు ,  జీవత్వాన్ని తొలగించి చిన్మయత్వాన్ని ప్రసాదిస్తాయి.

అని గురువు గారు తెలియచేసారు. పరమార్థంలో- గోపికల 'అనాది అజ్ఞాన ఆవరణ'మనే అంబరాలను (చీరలను) అపహరించాడు. మనం కృష్ణ  తత్వాన్ని గ్రహించాలి 

నేను ఒక మంచి పద్యం ను అందించే ప్రయత్నం చేస్తాను 

మామా వలువలు ముట్టకు

మామా ! కొనిపోకుపోకు మన్నింపు తగన్

మామాన మేల కొనియెదు?

మామానసహరణ మేల? మానుము కృష్ణా!


నాయనా! కృష్ణా! మా బట్టలు తాకొద్దు. వాటిని తీయకు. మా మాట విను. మా సిగ్గు తీయకు. మా మనస్సులు దొంగిలించకు. ఈ ప్రయత్నం వదిలిపెట్టు.


          గోపికా వస్త్రాపహరణ బాగా ప్రసిద్దమైన ఘట్టం. కృష్ణుడు గోపికల వస్త్రములు పట్టుకొని నల్లవిరుగు చెట్టు (నీపము) ఎక్కాడు. నీళ్ళల్లో ఉన్న గోపికలు పెట్టు కున్న ఈ మొర బహు చక్కటిది. అక్షరం “మా” 7 సార్లు (మకారం 11 సార్లు) వృత్యనుప్రాసంగా ప్రయోగించ బడింది. మా మా – మా అందరివి, మామా – సంభోదన, మా మాన – మా యొక్క మానం, మా మానస – మా యొక్క మనస్సులు అని మామా 4 సార్లు వాడిన యమకాలంకారం పద్యానికి సొగసులు అద్దింది. గోపికలు అంటే ఆత్మలు, కృష్ణ అంటే బ్రహతత్వం, వలువలు అంటే అవిద్యా ఆవరణలు, మా అంటే అహంకారం అనుకుంటే వచ్చే శ్లేష విశిష్ఠ మైన అలంకారంగా భాసిస్తుంది. పాలపర్తి నాగేశ్వర శాస్త్రులు గారు “ప్రజ్ఞ అనె తల్లి తో బుట్టినది బ్రహ్మతత్వం గనుక జీవునికి మామ అయింది” అన్నారు.

మామా = మావి మావి, మా అందరి; వలువలు = వస్త్రములు; ముట్టకు = తాక వద్దు; మామా = నాయనా; కొనిపోకుపోకు = పట్టుకుకొని; పోకు = పోబోకుము; మన్నింపు = మా మాట విను; తగన్ = చక్కగా; మా = మా యొక్క; మానము = మర్యాదను; ఏల = ఎందుకు; కొనియెదవు = తీసెదవు; మా = మా యొక్క; మానస = మనస్సులను; హరణము = అపహరించుట; ఏలన్ = ఎందుకు; మానుము = విడువము; కృష్ణా = కృష్ణుడా.

ఆ ఘట్టములో మనం తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఒకటి ఉన్నది. అది తెలుసుకుంటే మనం ప్రతినిత్యము చేసే కర్మ అనగా పూజాదికములలో పొరపాట్లనుండి ఎలా గట్టెక్కగలమో ఒక అద్భుతమయిన మార్గమును చూపించగలిగిన లీల. 

అదే ఈ రోజు గురువు గారు మన శ్రీమద్ భాగవతం లో ప్రస్తావించారు 

ఇట్లు 

శివ పరివారం

Monday, March 8, 2021

కాళీయ మర్దనం

DATE : 08-03-21 


ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

మనకి నిత్యం జరిగే శ్రీ మద్భాగవతం ఇప్పుడు కాళీయ మర్దనం ఘట్టం లోకి వచ్చేసింది..

శ్రీ కృష్ణుడు లీలలు ఒక్కో ఘట్టం వింటుంటే ఎంతో ఆనందం గా ఉంది.. 

గురువు గారు ఫోన్ చేసి ఈ రోజు మీ అమ్మాయి కృష్ణ మానస చే స్వామి వారికీ నివేదన ఇప్పిచాలి అనుకున్నాను.. శ్రీ కృష్ణడు కాళీయ మర్దనం నటరాజ దృశ్యం. ఉంది.. అమ్మాయి చే ఒక పాటకి నృత్యం చేయించు అన్నారు..

మా అమ్మాయి అనుకున్న పాట వేరు అప్పటికప్పుడు స్వామి వారి ఆశీస్సులు తో ఇంకో పాట పెట్టాను.. సందర్భానుసారం గా స్వామి వారికీ తన నృత్యం తో శ్రీ కృష్ణుడి లీలల తో నృత్య ప్రదర్శన ఇచ్చింది.. తన సమయస్ఫూర్తి తో చేసినందుకు శ్రీ రామ రక్షా 


కాళీయ మర్ధనం యెవరు చేసారో గుర్తుంది కదా?, ఔను కృష్ణుడే చేసాడు! ఎందుకు చేసాడంటే… అసలు కాళీయుడెవరో అతని కథేమిటో తెలుసుకుందామా ..


కాళింది మడుగున వున్న విషసర్పం పేరే కాళీయుడు! కాళీయుడు చిమ్మిన విషం వల్ల నీళ్ళన్నీ విషతుల్యమయ్యాయి. ఆ నీళ్ళు తాగిన వాళ్ళు చనిపోయారు. ఆ నీటిలో వున్న చేపలూ తాబేళ్ళూ వంటి జీవరాసులెన్నో చనిపోయాయి. కాళింది మడుగులోకి దిగాలంటేనే జనం భయపడిపోయారు. కాళింది మడుగునే కాళీయుడున్నాడు. దాక్కున్నాడు!


కాళియ నాగుపాము యమునా నదిలో నివాసం ఏర్పరచుకుంది. ఆ పాము చిందించే విషంతో యమునా జలం కలుషితం అయింది. అంతేనా.. ఆ విషపు వేడికి నీలు మరుగుతూ, నదిపై ఎగిరే పక్షులకు కూడా హాని చేస్తోంది. ఆ వేడి సేగాలకు తట్టుకోలేక పక్షులు, నదిలో పడి చనిపోసాగాయి. ఇది చూసిన బాల కృష్ణుని మనసు ఆర్ద్రమైంది.


కాళీయుడు కాళింది మడుగున దాక్కోవడం వెనుక కథ ఉంది. కద్రువ కడుపున పుట్టిన కాళీయుడు మొదట రమణక ద్వీపంలోనే ఉండేవాడు. అక్కడున్న పాముల్ని చూసి జనం భయపడిపోయారు. వాటికి కావలసిన ఆహారం ఇస్తే తమ జోలికి రావని భావించారు. అందుకే ప్రతిరోజూ ఆహారాన్ని తీసుకొచ్చి చెట్ల మొదళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయేవారు. దాంతో పాములు జనం మీదకి వెళ్ళేవికావు. కాని పాముల్ని చూసి జనం భయపడినట్టే – గరుడుని చూసి పాములూ భయపడేవి. అందుకే తమకి జనం పెట్టిన ఆహారంలో కొంత భాగం తీసి గరుడుడికి ఇచ్చేవి. దాంతో గరుడుడు పాములజోలికి వెళ్ళేవాడు కాదు. అయితే కాళీయుడు గరుడుడికి కేటాయించి పెట్టిన ఆహారాన్ని వదలకుండా తనే తినేవాడు. ఈ సంగతి గరుడుడికి తెలిసింది. కోపం వచ్చింది. కక్ష పెరిగింది. కాళీయుడు కోసం గరుత్మంతుడు వెదికాడు. వెంటాడి వేటాడ బోయాడు. కాళీయుడు భయపడ్డాడు. పారిపోయి వచ్చి కాళింది మడుగున స్థిరపడ్డాడు. *గరుత్మంతునికి తెలిసినా కాళీయుడు ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే గరుత్మంతుడు కాళింది మడుగుకి వచ్చాడా చచ్చాడే*! అలాంటి శాపముంది. ఆ శాపం కాళీయుడికి తెలిసింది. గరుత్మంతుడు తననేమీ చేయలేడని మరింత గర్వపడ్డాడు కాళీయుడు!


దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దైవ లక్షణం కదా! యమునా జలాలకు కాలుష్యం నుండి విముక్తి ప్రసాదించాలని, కాళీయుని కోరల్లోంచి వెలువడుతోన్న విషం నుండి పశుపక్ష్యాదులను కాపాడాలని, యమునా జలాన్ని తిరిగి మంచినీటిగా మార్చాలని అనుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదిలో దూకాడు. కాళీయ సర్పం కృష్ణుని చూసింది. తనకు అపకారం తలపెట్టిన బాలకుడు ఎవరు అని ఆశ్చర్యపోయింది. తక్షణం బుద్ధి చెప్పాలని, తన పొడవాటి శరీరంతో కృష్ణుని చుట్టేసింది.ఒడ్డున ఉన్నగోప బాలికలు, యశోదమ్మ అందరూ కంగారుపడ్డారు. భయాందోళనలకు లోనయ్యారు.


కాళింది మడుగు ఉన్నా దాంట్లోకి పెద్దలు దిగనివ్వక పోవడం, జరిగిన నష్టం యెరిగి కృష్ణుడు ఊరుకోలేదు. మడుగు పక్కనే వున్న చెట్టు ఎక్కాడు. ఆ చెట్టుకొమ్మలు మడుగులో తమ నీడ చూసుకుంటుంటే – కొమ్మ మీదుగా వచ్చిన కృష్ణుడు కాళీయుని జాడ చూసుకున్నాడు. మిత్రులు వారించినా వినలేదు. అద్దంలా మెరిసే నీళ్ళలో కాళీయుడు పడగ విప్పి కనిపిస్తూ ఉండడంతో అదే అదనుగా పడగమీదకు దూకాడు కృష్ణుడు. పడగ మీద పాదం మోపి తాండవం చేసాడు. కాళీయుడు కృష్ణుణి భారాన్నీ అవమాన భారాన్నీ మోయలేకపోయాడు. నీటిపైకి శిరస్సు యెత్తి ముంచి యెంతో ప్రయత్నించాడు. కృష్ణుడు కాళీయ మర్దనం అంటే కాళీయుని పడగని పొగరుని నలగ్గొట్టాడు. అతిబల గర్వాన్ని, అహంకారాన్ని అణచేసాడు. శిరసు చితికిపోయేంతగా తొక్కాడు కృష్ణుడు.


దాంతో కృష్ణుడు నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. శ్రీకృష్ణుని ఆకృతి పెరగడంతో కాళీయ సర్పం పట్టు విడిపోయి, కోపంతో బుసలు కొట్టింది. ఇక కృష్ణుడు కాళీయుని నూరు పడగలపై నృత్యం చేశాడు. శ్రీకృష్ణుడు ఒక్కో పడగమీదికి లంఘిస్తూ కాళియ మర్దనం చేస్తోంటే కాళీయుడు తగ్గిపోయాడు. పడగలు దెబ్బతిన్నాయి. రక్తం ధారలు కట్టింది. కాళీయుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు. శ్రీకృష్ణుని శరణు వేడాడు. కాళీయుని భార్యలు కూడా కృష్ణుని పాదాలపై పడి, కాళీయుని క్షమించమని కోరాయి. కృష్ణుడు దయ తలచాడు.. కాళీయుని వెంటనే యమునానది వదిలి వెళ్ళి, రమణక ద్వీపానికి వెళ్ళమన్నాడు. కాళీయుడు కుటుంబ సమేతంగా యమున వదిలి వెళ్లడంతో యమునాజలం పవిత్రమైంది. అందరూ ఆనందించారు

కాళీయుని భార్యలైన నాగకన్యలు వచ్చారు. తమ భర్తని విడిచిపెట్టమని వేడుకున్నారు. కృష్ణుడు చంపకుండా కాళీయుణ్ణి వదిలాడు. గరుత్మంతునితో చావులేకుండా అభయమిచ్చాడు. పాతాళలోకానికి పొమ్మన్నాడు. తిరిగి తాను నివసించిన రమణక ద్వీపానికి కృష్ణుని అనుమతితో భార్యల్ని తీసుకుని కాళీయుడు వెళ్ళిపోయాడు!

కృష్ణుని కాళీయ మర్ధనం వల్ల అటు కాళీయునికీ ఇటు కాళిందిని రక్షించి జనానికి మేలు జరిగింది!.

అలా అందరూ కాళీయుడి విషవాయువుల నుంచి విముక్తి పొందారు. యమునా నది సైతం పవిత్రమైంది. ఇలా కాళీయమర్దనం స్మరించుకుంటే అనేక గ్రహదోషాలు పోతాయి.

ఇట్లు 

శివ పరివారం 

మా నామ గీత అమృతం లో కూడా ఒక పద్యం ఉంది 

వందేకాళియ గర్వనాశన కరం వందే జగజ్జీవనం వందే యాదవకాంతవస్త్ర హరణం వందేత్రిమూర్త్యాత్మకం వందే నారద శంకరాది వినుతం వందే రమావల్లభం వందే కౌస్తుభ రత్న భూషణధరం వందే సుభక్తప్రియమ్.