కురుక్షేత్ర సంగ్రామంలో తీవ్రంగా గాయపడి, తన ఇష్టానుసారం కురు పితామహుడు భీష్మాచార్యుడు గతించిన రోజు భీష్మ ఏకాదశి. తిథి నక్షత్రాలను, వార వర్జ్యాలను పాటించేవారు ఏకాదశిని మంచిరోజుగా భావిస్తుంటారు. భీష్మ ఏకాదశిని మరింత పవిత్రమైన రోజుగా భావిస్తారు. భీష్మ ఏకాదశికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ఉంది.
భీష్ముడి గురించి తెలియని వారుండరు. మహాభారతంలో భీష్ముడిది చాలా గొప్ప పాత్ర. మహాభారత గాథకు మూల స్తంభమైన భీష్ముడు పుట్టగానే గంగాదేవి వెళ్ళిపోతుంది. ఇతని మొదటి పేరు దేవపుత్రుడు. శంతనుడు దాసరాజు కుమార్తె సత్యవతిని ఇష్టపడతాడు. ఆమెతో తండ్రి వివాహం కోసం దేవపుత్రుడు రాజ్యాన్ని వదులుకుని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పటినుంచి గాంగేయుడు ‘భీష్ముడు’ అయ్యాడు.
సత్యవతితో తన వివాహం కోసం సామ్రాజ్యాన్ని వైవాహిక జీవితాన్ని కుమారుడు భీష్ముడు త్యాగం చెయ్యడంతో శంతనుడు బాధపడతాడు. ఇంత త్యాగం చేసిన కుమారునికి స్వచ్చంద మరణాన్ని వరంగా ప్రసాదిస్తాడు. అనంతరం పాండవులు, కౌరవులకు కురుక్షేత్రంలో మహాసంగ్రామం జరుగుతుంది. ఆ యుద్దంలో పదిరోజులు తీవ్రంగా యుద్ధం చేసిన భీష్ముడు అర్జునుని ధనుర్భాణానికి నేలకొరిగి శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను ఆశ్రయిస్తాడు. దీన్ని తలపునకు తెచ్చేది ఏకాదశి వ్రతం.
కార్తీక శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను ఆశ్రయించిన భీష్ముడు మాఘశుద్ధ అష్టమి నాడు మరణించినట్టుగా పలు పురాణ గ్రంథాల్లో పేర్కొన్నారు. ఉత్తరాయణం మాఘశుద్ధ అష్టమి రోజు ప్రవేశించినట్టుగా ప్రమాణాలు ఉన్నాయి. నిర్ణయ సింధువులలోనూ, భీష్మ సింధువులలోనూ, ధర్మ సింధువులలోనూ మాఘ శుద్ధ అష్టమినాడు భీష్మునికి తిలాంజలి విడిచి పూజించాలని ఉంది.
భీష్మాష్టమి నాడు భీష్మునికి శ్రాద్ధ కర్మలు చేసినవారికి సంతానాభివృద్ధి జరుగుతుందని, పుణ్యం ప్రాప్తిస్తుందని పలువురు అంటున్నారు. ఈ కారణంగా భీష్మ ఏకాదశి, భీష్మాష్టమి పుణ్యదినాలయ్యాయి. పలు పర్వదినాలున్నా అన్నింటినీ అందరూ చేసుకోన్నట్లే భీష్మ ఏకాదశిని కూడా బ్రాహ్మణ, క్షత్రియులే పాటిస్తూ వస్తున్నారు. సంతాన భాగ్యానికి దూరమై మరణించిన భీష్మునికి వారసులమని క్షత్రియులంతా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున భీష్మునికి తర్పణం వదలటం ఆనవాయితీ. అయితే భీష్ముడు మరణించిన రోజున బ్రాహ్మణులు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశినాడు ఉపవాస దీక్ష విరమిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో క్షత్రియులు భీష్మ ఏకాదశి రోజున పండితులను పిలిపించుకుని భీష్ముని జన్మ వృత్తాంతాన్నంతా చెప్పించుకుంటున్నారు. సంతాన ప్రాప్తిని కోరే చాలామంది బ్రాహ్మణ, క్షత్రియేతరులు కూడా భీష్మ ఏకాదశిని పాటిస్తున్నారు.
***********************************************
భీష్మ ఏకాదశి
||ॐ||ఓం నమోనారాయణాయ || ॐ ||
ॐ అంపశయ్యపై శయనించిన భీష్ముడిని చూడడానికి శ్రీ కృష్ణ పరమాత్మ, ధర్మరాజు వెళ్ళినప్పుడు భీష్ముడి నోటి ద్వారా ధర్మరాజుకి, ఈ లోకానికి ధర్మము, భక్తి గొప్పతనముతెలియపరచాలని, అలాగే భీష్ముడు గొప్పతనం ఈ లోకానికితెలియపరచాలని భావించాడు.
ॐ భీష్మునిలోనిభగవతత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఈయన నెంతగానో ప్రశంసించాడు. అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహం తోనే సాక్షాత్తూ ధర్మదేవత తనయుడే అయిన ధర్మరాజు కు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు భీష్ముడు. వర్ణాశ్రమ ధర్మాలు, రాజ ధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్ష ధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, స్ర్తీ ధర్మాలు, దాన ధర్మాలు, ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మసందేహాలన్నింటినీ తీర్చి చక్కటి సమాధానాలిచ్చాడు భీష్ముడు. చక్కటి కథల రూపం లో… వినగానే ఎవరైనా అర్ధం చేసుకోగల తీరులో అవన్నీ మహా భారతం శాంతి, అనుశాసనిక పర్వాలలో నిక్షిప్తమై ఉన్నాయి. అప్పుడు ధర్మరాజు భీష్మునితో
ॐ “కిమేకిం దైవతం లోకే” అంటే ఈ లోకంలో అందరికంటే గొప్పదైవం ఎవరు?గొప్ప దైవం అంటే బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, వరుణ మొదలైన దేవతలు అందరి చేత పూజింపబడే దైవం ఎవరు?
ॐ “కింవా ప్యేకం పరాయణం”- ఈ లోకంలో అందరి గమ్యస్థానం ఏది? ప్రతి జీవుడు(ఆత్మ) చేరుకోదగిన గమ్యస్థానం ఏమిటి?
ॐ స్తువంతః కః -ఎవరిని స్తుతించడం వలన
ॐ కం అర్చయంతః – ఎవరిని అర్చించడం/ పూజించడం వలన
ॐ ప్రాప్యుః మానవః శుభం – మనిషికి సర్వశుభాలు కలుగుతాయి.
ॐ కో ధర్మః సర్వ ధర్మాణాం భవతః పరమో మతః – అన్ని ధర్మాల్లోకెల్లా ఏ ధర్మం ఉత్తమమైనది,గొప్పదని మీ అభిప్రాయం?
ॐ కిం జపం ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్ – ఎవరి నామజపం చేయడం వలన ఈ అనేక మార్లు జన్మించే అవస్థ నుంచి విముక్తి లభిస్తుంది?
అని అడుగుతాడు.
ॐ జగత్ ప్రభుం – ఈ జగత్తుకు ప్రభువైన వాడు
ॐ దేవదేవం – దేవతలకు కూడా దేవుడు, దేవతలచే ఆరాధించబడేవాడు
ॐ అనంతం – అంతం అంటూ లేని వాడు, అంతటావ్యాపించి ఉన్నవాడు
ॐ పురుషోత్తమం అందరిలో కెల్లా ఉత్తమమైనవాడు, మోక్షాన్ని ప్రసాదించేవాడు
ॐ స్తువః నామ సహస్రేణ పురుషః సతతోత్థితః – ఎవరి సహస్రనామాలను స్తుతంచడం చేత మనుష్యులు మంచి స్తితిని పొందుతారో ………….
అంటూ మొదలుపెట్టి “విశ్వం విష్ణుః వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః……” అంటూ ఈ లోకానికి పరమపవిత్రమైన శ్రీ విష్ణు సహస్రనామాలను (1000 నామాలను) ఈ లోకానికి అందించారు భీష్మాచార్యుల వారు.
ॐ అటువంటి గొప్ప భక్తుడు, ధార్మిక వేత్త, యోధుడైన భీష్మాచార్యులవారు మాఘశుద్ధ అష్టమి రోజున నిర్యాణం చెందారు. ఆయనకు గౌరవార్ధం మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా ఈ లోకం జరపాలని మన శ్రీ కృష్ణ పరమాత్మ ఆదేశించారు.
ॐ ఈ రోజు తప్పకుండా శ్రీ విష్ణు సహస్రనామాలను పఠించండి. విష్ణు సహస్ర నామాలను పఠించలేని వారు
“శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||”
ఈ పైశ్లోకం చదివితే విష్ణు సహస్ర నామాలు చదివినదానితో సమానం!! ఇది పార్వతీ దేవికి పరమ శివుడు వివరించాడు!!